ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాంతో అందరూ ఆమె సినీ కేరిర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ అందరి భావనలను తలకిందులు చేస్తూ సమంత వ్యాధి నుంచి తొందరగా కోలుకొని తిరిగి సినిమాలలో బిజీ అయింది. సినిమాలలో బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది సమంత.
సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఆ భయంకరమైన అనారోగ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తనకి అనారోగ్యం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘వ్యాధి నిర్ధారణ జరిగి సంవత్సరం అయింది. ఈ భయంకరమైన వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా శరీరంలో, ఆహారంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఉప్పు, పంచదార, లాంటి ఎన్నో ఆహార పదార్థాలు తినడం పూర్తిగా మానేసాను. కేవలం మందుల మీదనే ఆధారపడి బ్రతికాను. ఎంతో కష్టపడి కొన్నిటిని మానేశాను, అలానే ఎంత కష్టమైనా కొన్నిటిని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ ఏడాది జీవితానికి అర్థం తెలుసుకొని, ఆత్మ పరిశీలన చేసుకున్నాను’ అంటూ చాలా ఎమోషనల్ గా తన అనారోగ్య అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
అంతేకాకుండా తను శరీరకంగా దృఢంగా ఉండాలని, తనకి మానసిక ప్రశాంతతని ఇవ్వమని గడిచిన ఏడాది కాలంలో దేవుళ్లకి ఎన్నో పూజలు, వ్రతాలు చేసానని సమంత చెప్పింది. జీవితం మనం అనుకున్న విధంగా ఉండదని తనకు ఈ ఏడాది అర్థం అయిందని చెప్పింది. అలానే మనం అనుకున్నది జరగన్నపుడు బాధపడకూడదు, మనకు సాధ్యమైన పనిని చేసి తృప్తి పడాలి కానీ, ఏదో చెయ్యాలి అని పరుగులు తియ్యకూడదు అని సామ్ వెల్లడించింది. ఇలా తన బాధని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది సామ్. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమా లో నటిస్తుంది.