మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు ఆపాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూబ్లీ హిల్స్ లోని 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ విక్రయించగా చిరంజీవి కొనుగోలు చేశారు. అందులో నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు.
దీంతో ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, తదితరులు వేసిన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు వివాదాస్పదమైన ఆ స్థలం యథాతథంగా కొనసాగాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడీ విషయంలో హాట్ టాపిక్ గా మారింది.