కొత్త వివాదంలో ర‌వితేజ‌.. ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!?

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకుని మంచి జ్యోష్‌లో ఉన్న ర‌వితేజ‌.. ఇప్పుడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వ‌హిస్తున్నారు.

అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా న‌టిస్తే.. పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా రావణాసుర టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిల‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ ను ద‌క్కించుకుంది. యాక్షన్‌తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ సాగిన ఈ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

అయితే టీజ‌ర్ లో `సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి.` అంటూ ర‌వితేజ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ డైలాగ్ వ‌ల్లే ర‌వితేజ వివాదంలో ప‌డ్డాడు. నెగటివ్ షేడ్స్ తో ఉన్న హీరో రోల్ ఎలివేట్ చెయ్యడం కోసం సీత లాంటి మహాపతీవ్రత పేరు తీసి ఆమెని తగ్గిస్తారా అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇలాంటి డైలాగ్స్ డైరెక్టర్ పెడుతున్నప్పుడు వద్దు అని చెప్పే బుద్ధి ర‌వితేజ‌కు లేదా అంటూ నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై ర‌వితేజ మ‌రియు చిత్ర టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.