ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తూ మేకర్స్ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు పాత సినిమాలన్నీ బయటకు తీస్తున్నారు.
ఇందులో భాగంగానే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `ఆంధ్రావాలా` సినిమాను రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే నెల వచ్చే వారంలో మరోసారి థియటర్లలోకి రాబోతుంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో.. అప్పట్లో ఆంధ్రావాలాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే 2004, జనవరి 1న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సొంత అభిమానులు కూడా ఈ సినిమాపై పెదవి విరిచారు. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేయడంతో ఫ్యాన్స్ షాకైపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రావాలా మేకర్స్ పై మండిపడుతున్నారు. బుద్ధుందా..లేదా..? ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ నిలిచిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.