ఎమ్మెల్సీ పోరు..టీడీపీ హవా..ఆ సీటులో టఫ్ ఫైట్!

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకాలం ఏ ఎన్నికలైన వైసీపీదే గెలుపు అనే పరిస్తితి..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్,..ఉపఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసిందే. అధికార బలాన్ని, ప్రలోభాలు, వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయనే బెదిరింపులు..సరే ఏది ఎలా జరిగినా చివరికి గెలుపు వైసీపీదే.

ఇక స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీ బలం 80 శాతం పైనే. కాబట్టి ఆ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇక రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా వైసీపీనే గెలుచుకుంది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో టి‌డి‌పి పోటీ చేయలేదు..వైసీపీ, పి‌డి‌ఎఫ్, యూ‌టి‌ఎఫ్ ల మధ్య పోరు నడిచింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు కల్పించారు. దీంతో వైసీపీ గెలుపు సాధ్యమైంది.

యజమాన్యల ఒత్తిడి కావచ్చు, ప్రలోభాలు కావచ్చు..వైసీపీ విజయం సాధ్యమైంది. కానీ ప్రభుత్వ టీచర్లు మాత్రం వైసీపీ వైపుకు పెద్దగా వెళ్లలేదని తేలింది. అందుకే వైసీపీ స్వల్ప మెజారిటీలతోనే గెలిచి బయటపడింది. ఒక స్థానంలో 169 ఓట్లతో గెలవగా, మరొక స్థానంలో 2 వేల ఓట్ల తేడాతో గెలిచింది. ఇలా ఎలాగోలా టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ గెలుచుకుంది.

కానీ అసలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన పరాజయం పాలైంది. భారీ స్థాయిలో ఓట్లు పడిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో టి‌డి‌పి నుంచి వేపాడ చిరంజీవిరావు గెలిచారు. ఇటు తూర్పు రాయలసీమ స్థానంలో టి‌డి‌పి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. ఇక పశ్చిమ రాయలసీమ స్థానంలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.