కేశినేనిపై తమ్ముళ్ళు డౌట్..మోదీని కలిశాకే!

కేశినేని నాని రోజురోజుకూ టి‌డి‌పికి దూరం అవుతున్నారా? ఆయనకు నెక్స్ట్ సీటు లేదని టి‌డి‌పి అధిష్టానం తేల్చేసిందా? అంటే ప్రస్తుతం నాని ఇండిపెండెంట్ మాదిరిగా ముందుకెళ్లడం చూస్తే..ఆయన టి‌డి‌పికి దూరమైనట్లే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన..ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై కంటే..సొంత పార్టీ టి‌డి‌పిపైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు.

కొందరు నేతలని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ వస్తున్నారు..వారి వల్లే పార్టీ నాశనం అవుతుందని అంటున్నారు. అయినా సరే టి‌డి‌పి అధిష్టానం తన మాటలు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కేశినేనికి వ్యతిరేకంగా విజయవాడలోని కొందరు టి‌డి‌పి నేతలు పావులు కదుపుతున్నారు. ఆయనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పార్లమెంట్ లో నానికి పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో చిన్ని పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎంపీ సీటు ఆయనకే అని ప్రచారం జరుగుతుంది.

దీంతో నాని పార్టీకి ఇంకా దూరం జరుగుతున్నారు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియాలో టి‌డి‌పి జెండా గాని, చంద్రబాబు ఫోటో గాని కనిపించకుండా చేశారు. ఇదే సమయంలో ఆయన బి‌జే‌పిలోకి వెళుతున్నారనే ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి మోదీని కలిశారు. తన కుమార్తె శ్వేత…అల్లుడుని తీసుకెళ్లి మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు రాష్ట్రపతిని కూడా కలిశారు.

అయితే ఇలా మోదీని కలవడంపై కొందరు తమ్ముళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కేశినేని జంప్ చేయడానికి రెడీ అవుతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ కేశినేని ఎంపీగా..తన ఫ్యామిలీని తీసుకెళ్లి మోదీని కలవడంలో తప్పేమీ లేదు. మరి కేశినేని నిజంగానే జంపింగ్ కోసమే కలిశారా? లేక ఆశీర్వాదం కోసం కలిశారా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.