ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అందులో కీలకంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని, ఆమె పేరు ఈడీ రిపోర్టులో కూడా వచ్చిన తెలిసిందే.
అలాగే సిబిఐ ఓ సారి కవితని విచారించింది. ఇక ఈడీ ఢిల్లీలో కవితని విచారణ చేయడానికి సిద్ధమవుతుంది. విచారణ తర్వాత ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కవితని అరెస్ట్ చేస్తే..పోలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాలని కేసిఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది..దీనిపై రాజకీయంగా బిజేపిని టార్గెట్ చేసి, దేశ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈడీ విచారణ కంటే ముందు కవిత ఢిల్లీకి వెళ్లారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి నుంచి కవిత జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. ఇక మార్చి 11న కవితని ఈడీ విచారించనుంది.
ఇక ఈడీ విచారణలో ఏం జరుగుతుందో అని బిఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే రేంజ్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అలాగే కవిత గాని అరెస్ట్ అయితే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.