సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే గతంలో ఓసారి వరలక్ష్మి జైలుకు వెళ్లిందట. ఈ విషయాన్ని మరెవరో కాదు ఆమె తండ్రి శరత్ కుమార్ స్వయంగా బయట పెట్టాడు. వరలక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన `కొండ్రాల్ పావమ్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శరత్ కుమార్ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `నా కూతురు వరలక్ష్మి మొదటి నుంచి స్వయంకృషితోనే ఎదిగింది. అంతే కాదు చాలా ధైర్యవంతురాలు కూడా. ఒకసారి మీ కూతురు పోలీస్ స్టేషన్ లో ఉంది అంటూ పోలీసులు ఫోన్ చేశారు. ఎందుకంటే నా కూతురు ఓ ఇద్దరు అబ్బాయిలను చితకబాదింది. అంతకు ముందు వారిద్దరూ తన కారును ఢీ కొట్టారు. అందుకే ఆమె అలా చేసింది. నా కూతురు ట్యాలెంట్ ఉన్న అమ్మాయి మాత్రమే కాదు చాలా ధైర్యవంతురాలు అయినందుకు గర్వంగా ఉంది` అంటూ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. దీంతో వరలక్ష్మి జైలుకు వెళ్లిందా అంటూ నెటిజన్లు షాకైపోతున్నారు.