టీడీపీతో సీపీఐ కూడా రెడీ..ఫిక్స్ చేసేశారు!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో పోటీ చేస్తుందో ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. చాలా రోజుల నుంచి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం వస్తూనే ఉంది. ఈ పొత్తు ఉంటే తమకు నష్టమని తెలిసిన వైసీపీ..పొత్తుని ఏదొక విధంగా చెడగొట్టడానికే చూస్తుంది. కానీ టి‌డి‌పి-జనసేన మాత్రం పొత్తు దిశగానే వెళుతున్నాయి. తాజాగా పవన్ సైతం పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. కలిసి పనిచేద్దామంటే బి‌జే‌పి ముందుకు రాలేదని, బి‌జే‌పితో కలిసి బలపడి ఉంటే టి‌డి‌పి అవసరం వచ్చేది కాదని అన్నారు.

వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని అన్నారు. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమన్నట్లు పవన్ చెప్పారు. ఇటు బి‌జే‌పిని ఇంకా వదిలేసినట్లే అని చెప్పవచ్చు. బి‌జే‌పి అసలు టి‌డి‌పితో పొత్తుకు రెడీగా లేదు. దీంతో ఆ పార్టీ సైడ్ అయిపోతుందనే చెప్పాలి. ఇక బీజేపీ కలవకపోతే తాము కలవడానికి రెడీగా ఉన్నామని సి‌పి‌ఐ ఎప్పటినుంచో చెబుతుంది. బి‌జే‌పితో పొత్తు ఉంటే మాత్రం తాము టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు బి‌జే‌పి పొత్తులోకి రావడం లేదు. దీంతో టి‌డి‌పితో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని సి‌పి‌ఐ రామకృష్ణ చెబుతున్నారు.

అంటే అటు జనసేన, ఇటు సి‌పి‌ఐ సైతం టి‌డి‌పితో పొత్తుకు రెడీగా ఉన్నాయి. కానీ పొత్తుల విషయంపై చంద్రబాబు ఇంకా స్పదించడం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచన చేద్దామని, ముందు పార్టీని బలోపేతం చేయాలని టి‌డి‌పి నేతలకు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్, కమ్యూనిస్ట్ పార్టీ టి‌డి‌పితో పొత్తుకు రెడీగా ఉన్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.