తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి.
బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు గెలుస్తారు..ఎవరు రెండో స్థానం..ఎవరు మూడో స్థానంలో నిలుస్తారో చెప్పలేని పరిస్తితి ఉంది. మొత్తానికి హోరాహోరీగా ఫైట్ జరగనుంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణకు చెందిన పలువురు సినీ ప్రముఖులు రెడీగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే మొదట నుంచి తెలంగాణలో పోటీ చేసే సినీ ప్రముఖులు తక్కువే అని చెప్పాలి. మొదట కమెడియన్ బాబూమోహన్.. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత ఆయన బిఆర్ఎస్ లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బిజేపిలో ఉన్నారు. బిజేపి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. అలాగే విజయశాంతి సైతం ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీ, బిఆర్ఎస్, కాంగ్రెస్…మళ్ళీ ఇప్పుడు బిజేపిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె కూడా బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. అలాగే బిజేపిలో జీవిత, కవిత కూడా ఉన్నారు. వీరు సీట్లు ఆశిస్తున్నారు.
సినీ హీరో నితిన్ బిజేపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రకాష్ రాజ్ సైతం బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. అటు డైరక్టర్ ఎన్.శంకర్ సైతం బిఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నారని తెలిసింది. మరి చూడాలి ఎంతమంది సినీ నటులు పోటీకి దిగుతారో.