తారకరత్న ఆఖ‌రి చూపుకు రాని మంచు హీరోలు.. కార‌ణం అదేనట‌!

నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌నివారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ చివ‌ర‌కు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

ఈ రోజు ఉద‌యం తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తార‌క‌ర‌త్న‌కు క‌డ‌సారి చూసేందుకు అభిమానులు, ప్ర‌జ‌లు భారీగా వ‌స్తున్నారు. మరోవైపు తారకరత్న అంత్యక్రియలు.. అంతిమయాత్రకు సంబంధించిన పనులను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.

అయితే తారకరత్న ఆఖ‌రి చూపుకు మంచు హీరోలెవ‌రో రాలేదు. ఈ విష‌యంపై మోహ‌న్ బాబు క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం తాను లండన్ లో, మంచు విష్ణు సింగపూర్ లో ఉన్నామ‌ని.. అందువ‌ల్ల‌నే వ్యక్తిగతంగా రాలేకపోతున్నామని వివరించారు. తన అన్నగారైన నందమూరి తారక రామారావుగారి మనవడు తారకరత్న తనకు, తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని, అలాంటి వ్య‌క్తిని కోల్పోవడం జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని మోహ‌న్ బాబు తెలిపారు. అలాగే తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.