బీజేపీలో వెయిటింగ్ లిస్ట్..బాబు ఆఫర్ కోసమేనా?

ఏపీ బీజేపీకి వరుస షాకులు తగలనున్నాయి. టి‌డి‌పితో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బి‌జే‌పిని వీడటానికి నేతలు రెడీగా ఉన్నారంటే? ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా ఏపీ లో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేని సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో బి‌జే‌పి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది.

అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటుందేమో..అప్పుడు మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు అనే ఆశతో కొందరు నేతలు ఉన్నారు. కానీ పరోక్షంగా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ..వైసీపీకి అనుకూలంగా ఉండటం..టి‌డి‌పితో పొత్తు లేదంటే లేదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు బి‌జే‌పితో పొత్తులో ఉన్న జనసేన సైతం..టి‌డి‌పితో కలవడానికి రెడీగా ఉంది. కానీ ఏ మాత్రం బలం లేని బి‌జే‌పి మాత్రం..టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదనే చెప్పేస్తుంది. అటు టి‌డి‌పి కూడా బి‌జే‌పితో కలవడానికి ఇష్టపడటం లేదు. జనసేనతో ఓకే అంటుంది.

ఇక పొత్తు లేని నేపథ్యంలో బి‌జే‌పిలో ఆశగా ఎదురుచూస్తున్న కొందరు నేతలు టి‌డి‌పిలోకి జంప్ చేసేలా ఉన్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ బి‌జే‌పికి రాజీనామా చేసి టి‌డి‌పిలోకి వచ్చారు. ఇక ఈయన బాటలోనే కొందరు నేతలు ఉన్నారని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, వరదాపురం సూరి లాంటి వారు బి‌జే‌పిని వదిలి టి‌డి‌పిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇంకెంత మంది నేతలు బి‌జే‌పిని వదిలి టి‌డి‌పిలోకి వస్తారో.