బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా బిజేపికి దూరంగా ఉంటున్న కన్నా..ఈ నెలలోనే వేరే పార్టీలోకి జంప్ చేయడం ఖాయమని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కన్నా..రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉండగా..అప్పుడు జగన్ని కలిసి వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ కేంద్రం పెద్దలు..వైసీపీలో కన్నా చేరికకు బ్రేకులు వేశారు.
అదే సమయంలో బిజేపిలోకి ఆహ్వానించారు. దీంతో కన్నా బిజేపిలోకి వచ్చారు. అలాగే ఏపీ బిజేపి అధ్యక్షుడు అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కూడా బిజేపి అధ్యక్షుడుగా కొనసాగారు. కానీ అనూహ్యంగా అధిష్టానం కన్నాని తప్పించి సోము వీర్రాజుని అధ్యక్షుడుగా పెట్టింది. అప్పటినుంచి కన్నా బిజేపికి కాస్త దూరం జరుగుతూనే వచ్చారు. పైగా బిజేపిలో తాను నియమించిన నేతలని సోము నిదానంగా సైడ్ చేస్తూ వచ్చారు. దీంతో సోము విధానాలు కన్నాకు నచ్చలేదు. ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఇటీవల కాలంలో కన్నా పూర్తిగా బిజేపికి దూరమయ్యారని చెప్పవచ్చు. బిజేపి కార్యక్రమాల్లో కన్నా పాల్గొనడం లేదు. తాజాగ్ అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో సైతం ఆయన పాల్గొనలేదు. కాబట్టి పార్టీ మార్పు ఖాయమనే చర్చ జరుగుతోంది. కన్నా అనుచరులు సైతం ఆయన బీజేపీని వీడటం ఖాయమని చెబుతున్నారు.
ఈ క్రమంలో అనుచరులతో సమావేశమై ఏ పార్టీ లో చేరాలనేది నిర్ణయించుకుంటారని తెలిసింది. టిడిపి లేదా జనసేనలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తు బట్టి జనసేన వైపుకు వెళ్ళే ఛాన్స్ ఉంది..లేదంటే టిడిపిలోకి వస్తారని తెలుస్తోంది. చూడాలి మరి కన్నా ఏ పార్టీలోకి వెళ్తారో.