కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ గా వైసీపీ దాడులు చేసింది..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్థానిక టిడిపి నేత విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై దాడికి దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్ చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న ఇంటికెళ్ళి వంశీ అనుచరులు దాడి చేశారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసేందుకు టిడిపి శ్రేణులు పోలీసు స్టేషన్కు వెళ్ళాయి.
టిడిపి నేత పట్టాభితో కలిసి నేతలు స్టేషన్కు వెళ్లారు. ఇదే క్రమంలో టిడిపి ఆఫీసుపై వంశీ అనుచరులు దాడి చేసి ధ్వంసం చేశారు. అటు స్టేషన్కు వచ్చిన పట్టాభిపై కూడా దాడి చేయబోయారు. దీంతో పోలీసులు పట్టభిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ఆఫీసుపై దాడి చేసినప్పుడు టిడిపి నేత కారుని తగలబెట్టారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని టిడిపి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.
తమ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై గన్నవరం సెంటర్లో ఆందోళనకు దిగారు. వంశీ అనుచరులు కూడా అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని రాళ్లతో దాడిచేశారు. టీడీపీ శ్రేణులు సైతం ఎదురుదాడికి దిగాయి. అయితే తనని, కొడాలి నానిని తిట్టినందుకే తమ అనుచరులు దాడి చేశారని వంశీ అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే వంశీ, కొడాలి..చంద్రబాబు, లోకేష్లని ఎన్ని సార్లు తిట్టారో తెలుసని, అలాంటప్పుడు తాము ఏమి చేయాలని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
గన్నవరంలో టిడిపిని లేకుండా చేయడానికే వంశీ ఇలా దాడులు చేయిస్తున్నారని, ఎన్ని చేసిన తాము వెనుకడుగు వేసేది లేదని అంటున్నాయి. మొత్తానికి దాడులతో గన్నవరం హైలైట్ అయింది. ఇక దీంతో గన్నవరంలో టిడిపి కూడా ఉందని వంశీ తెలిసేలా చేశారని అంటున్నారు. మరి చూడాలి ఈ ఎపిసోడ్ పై గన్నవరం ప్రజలు ఎలా తీసుకుంటారో.