కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలి సారి నేరుగా చేసిన చిత్రమే `సార్(తమిళంలో వాతి)`. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
సాయికుమార్, తనికెళ్లభరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ తో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిన్న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధను మాట్లాడుతూ.. `తనకు తెలుగు సరిగా రాదు, తమిళం మాత్రమే వచ్చు. మీకోసం వచ్చీ రాని తెలుగు ని మాట్లాడుతాను, తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడకి వచ్చిన వాళ్లందరికీ అన్నీ భాషలు వచ్చు. కానీ నాకు తెలుగు రానందుకు సిగ్గు పడుతున్నాను. ఇక ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది అని చెప్పను. చాలా మామూలు సినిమా ఇది. సింపుల్ గా ఉన్నా ఎంతో మంచి మెసేజ్ ఉంటుంది. నా నటన కూడా గొప్పగా ఏమి ఉండదు, చాలా నార్మల్ గానే ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చాడు.