అనపర్తిలో బాబు దూకుడు..భారీగా ప్రజా మద్ధతు!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు భారీగా జనం వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రోడ్ షోలకు పెద్ద ఎత్తున టి‌డి‌పి శ్రేణులు, ప్రజలు వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన బాబుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..మొదట జగ్గంపేట, పెద్దాపురంల్లో భారీగా జనం కనిపించారు. కానీ మూడో రోజు షెడ్యూల్ లో భాగంగా అనపర్తికి వెళ్ళాలి.

ఇక అనపర్తి సభకు పర్మిషన్ కూడా ఇచ్చారు. కానీ ఏమైందో తెలియదు గాని..హఠాత్తుగా పర్మిషన్ రద్దు అయిందని స్థానిక పోలీసులు ప్రకటించారు. అసలు పర్మిషన్ ఇచ్చి..మళ్ళీ రద్దు చేయడంపై టి‌డి‌పి శ్రేణులు మండిపడ్డాయి. ఎట్టి పరిస్తితుల్లోనూ సభ నిర్వహిస్తామని పట్టుబట్టారు. ఇక బాబు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లారు. కానీ బాబుని ఎక్కడకక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక సభ నిర్వహించే అనపర్తి దేవిచౌక్‌కు ఆరు కిలోమీటర్ల అవతలే పోలీసులు..బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. పోలీసులే బారికేడ్లు పెట్టడం, రోడ్డుకు అడ్డంగా బైటాయించి..బాబు కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వలేదు.

దీంతో చంద్రబాబు ఊహించని విధంగా కాన్వాయ్ దిగి..నడుచుకుంటూ ముందుకొచ్చారు. దాదాపు 6 కిలోమీటర్లు నడిచి. దేవిచౌక్‌కు చేరుకున్నారు. అయితే అక్కడ ప్రజలని రానివ్వకుండా పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు గాని..కానీ ప్రజలు వెనక్కి తగ్గలేదు. బారికేడ్లని పక్కకు నెట్టి మరీ బాబు సభకు వచ్చారు.

పైగా బాబుని అడ్డుకోవడం, ఆయన కాలినడకన రావడంతో..దేవిచౌక్‌కు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. ఊహించని విధంగా జన సందోహం కనిపించింది. అయితే అక్కడ కూడా కరెంట్ తీసేయడం, జనరేటర్లు ఎత్తుకెళ్లడం, స్పీకర్లని ఆపాలని చూసి పోలీసులు విఫలమయ్యారు. పూర్తిగా ప్రజలు ఉండటంతో పోలీసులు సైతం ఏమి చేయలేకపోయారు. దీంతో బాబు సభ సక్సెస్ అయింది..భారీ జనసందోహంతో టి‌డి‌పిలో కొత్త ఉత్సాహం కనిపించింది.