క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో వైసీపీ..మరో భారీ స్కెచ్!`

కుల సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకుని..రాజకీయం చేయడంలో అధికార వైసీపీ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. సమయానికి తగినట్లుగా కుల సమీకరణాలతో వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్రతి కులానికి తగ్గట్టుగా రాజకీయం చేసి..దాదాపు అన్నీ కులాల మెజారిటీ ఓట్లని దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాతో వైసీపీ ముందుకెళుతుంది.

ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ ఓట్లని టార్గెట్ చేసుకుని జయహో బీసీ సభ నిరహించారు. అటు వైసీపీలోని కాపు నేతలంతా..కాపు ఓట్లు పోకుండా చూసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా..ఆ నేతలు పనిచేస్తున్నారు. ఇలా ఏ కులానికి ఆ కులం నేతలు..కులం ఓట్లు పోకుండా చూసుకునే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే ముస్లిం ఓటు బ్యాంక్ పై వైసీపీ కన్నేసింది. గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ముస్లిం ఓట్లు వైసీపీకే పడుతున్నాయి.

అయితే ఈ సారి ముస్లిం ఓట్లర్లో కాస్త మార్పు కనిపిస్తోంది. వైసీపీలో ముస్లిం అభ్యర్ధులు ఉన్న స్థానాల్లో టీడీపీకి కాస్త పట్టు దొరుకుతుంది. ఉదాహరణకు విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, మదనపల్లె, కర్నూలు సిటీ లాంటి స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంది..ఈ స్థానాల్లో టి‌డి‌పి పికప్ అవుతుంది. అంటే ముస్లిం ఓటర్లు ఈ సారి టీడీపీ వైపు చూసేలా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ముస్లింలకు సంబంధించి ఓ భారీ సభ ప్లాన్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. త్వరలో జయహో ముస్లి సభ నిర్వహిస్తామని తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ముస్లింలకు జగన్ ప్రభుత్వం చేసినట్లుగా ఎవరూ చేయలేదని, విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. మరి ఈ సారి ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.