వ‌చ్చే నెల‌లో కియారాతో పెళ్లి.. నన్ను పిలువలేదంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా!?

బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌గా పేరొందిన కియారా అడ్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర వ‌చ్చే ఫ్రిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పార్టీలు, పబ్బులు, విదేశీ పర్యటనలు అంటూ వీరిద్ద‌రూ క‌లిసి చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త‌ల‌కు కావాల్సినంత బ‌లం చేకూరింది.

బాలీవుడ్ మీడియా ఫిబ్ర‌వ‌రిలో కియారా, సిద్ధార్థ్ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మంటూ గ‌ట్టిగా చెబుతోంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్‌లో జరగనున్నట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు కూడా ప్రారంభ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై ఎప్పుడూ సిద్ధార్థ్ కానీ, కియారా కానీ స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు.

దీంతో అభిమానులు నిజమేననే భావనలో ఉండిపోయారు. కానీ, తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా `నన్ను ఎవరూ నా పెళ్లికి పిలువలేదు` అంటూ బిగ్ షాక్ ఇచ్చాడు. మిష‌న్ మ‌జ్ను ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సిద్ధార్థ్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. కియారాతో పెళ్లి వార్త‌ల‌పై ప్ర‌శ్న ఎదురైంది. అందుకు సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తన పెళ్లికి రెండు సార్లు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసిందన్నారు. అయితే తన పెళ్లికి ఇంత‌వ‌ర‌కు తనను ఎవరూ ఆహ్వానించలేదని, పబ్లిక్‌ను కూడా ఆహ్వానించలేదని త‌న‌దైన శైలిలో పెళ్లి వార్త‌ల‌ను ఖండించాడు. అయితే, అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై కంటే.. చిత్రాలపై దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని సూచించారు.