`యశోద` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా గుణశేఖర్ రూపొందించిన మైథలాజికల్ లవ్ స్టోరీ ఇది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించాడు.
ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజు దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ సమంతనే `శాకుంతలం` కోసం ఎందుకు తీసుకున్నారు అన్న విషయాన్ని బయటపెట్టాడు.
`మా అమ్మాయి నీలిమ యు.కె నుంచి వచ్చి నిర్మాతగా మారుతానని చెప్పింది. శాకుంతలం కథను సెలక్ట్ చేసుకుంది. ఇప్పటి జనరేషన్స్కు మన భారతీయ సంస్కృతి గొప్పతనం చెప్పి తీరాలి నాన్నా అని అంది. తన విజన్లో కావ్య నాయకి సమంత. తను మోడ్రన్గా ఉంటుంది కదా అని అనిపించినా.. కథ చదువుతూ సమంత అయితే ఎలా ఉంటుందని ఆలోచించాను. అప్పుడు తను చేసిన రామలక్ష్మి పాత్ర గుర్తుకు వచ్చింది. అంత మోడ్రన్ అయిన సమంతగారు విలేజ్ అమ్మాయిగా ఎలా మెప్పించారో తెలిసిందే. అందకే శకుంతల పాత్రకు సమంతనే సరిపోతుందని భావించాము. ఆమెనే ఫైనల్ చేశాం` అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఇక శకుంతలగా సమంత అద్భతుమైన నటనను కరబరిచిందని ట్రైలర్ తోనే తెలిపోయింది.