కవిత వర్సెస్ షర్మిల..కావాల్సింది ఇదే..!

ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హైలైట్ అవుతుంది…వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిల అక్కడున్న ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.అటు ప్రజల్లో కూడా షర్మిల పార్టీకి ఆదరణ రాలేదు. దీంతో షర్మిల రూట్ మార్చేశారు..పాదయాత్ర చేస్తూ..ఏ నియోజకవర్గంలో తిరిగితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గాని, స్థానిక మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తీవ్ర పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు చేశారు.

అయినా సరే టీఆర్ఎస్ నుంచి అనుకున్న విధంగా షర్మిలకు కౌంటర్లు రాలేదు. ఏదో మధ్య మధ్యలో కొందరు నేతలు మాత్రమే కౌంటర్లు ఇచ్చారు. దీని వల్ల షర్మిల స్టేట్ లెవెల్ లో హైలైట్ అవ్వలేదు. కానీ తాజాగా నర్సంపేటలో పాదయాత్ర చేస్తూ..అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు రివర్స్ అయ్యి.. షర్మిల పాదయాత్రపై రాళ్ళు రువ్వారు. బస్సుకు నిప్పుబెట్టారు..కార్లు ధ్వంసం చేశారు. అలాగే పోలీసులు షర్మిల పాదయాత్రకు బ్రేకులు వేశారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో ధ్వంసమైన కారుతో ప్రగతిభవన్‌కు వెళ్లాలని షర్మిల చూశారు. మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సొంత పూచీకత్తిపై విడుదల చేశారు. ఈ సంఘటనలతో షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. అలాగా టీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి షర్మిలని టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో షర్మిలకు బీజేపీ నేతలు సంఘీభావం తెలపడంపై కవిత సెటైర్లు వేశారు.

“తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అని ట్వీట్ చేశారు. అంటే షర్మిల..కమలం పార్టీ వదిలిన బాణం అన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వెంటనే కవితకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రలు చేసిందీ లేదు..ప్రజల సమస్యలు చూసిందీ లేదు..ఇచ్చిన హామీల అమలు లేదు..పదవేలే కానీ, పనితనం లేని గులాబీ తోట లో “కవిత”లకు కొదవ లేదంటూ కౌంటర్ వేశారు. ఇలా ఇరువురి మధ్య ట్వీట్ల వార్ నడిచింది. అయితే షర్మిలకు కూడా కావాల్సింది ఇదే..చివరికి టీఆర్ఎస్ నేతలని రెచ్చగొట్టారు..వారు విరుచుకుపడుతున్నారు..అనుకున్నట్లుగానే షర్మిల హైలైట్ అయ్యారు.