పొత్తులపై పవన్ క్లారిటీ..అదే మాట మీద..!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. కాకపోతే వైసీపీ అధికార బలంతో టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బకొడుతుంది. దీంతో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని టీడీపీ నిలువరించవచ్చు.

కానీ పొత్తుల అంశంలో రకరకాల చర్చలు వస్తున్నాయి గాని..ఏది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు జనసేన-బీజేపీ కలిసి ఉన్నాయని..ఆ రెండు టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ పెట్టవచ్చు. బీజేపీని వదిలేసి జనసేన కలిసిన సరిపోతుంది. కానీ జనసేనని టీడీపీ వైపుకు వెళ్లకుండా బీజేపీ నియంత్రిస్తుందని తెలుస్తోంది. అందుకే ఇటీవల ప్రధాని మోదీని కలిశాక పవన్.. పొత్తుల ఊసు ఎత్తడం లేదు. దీంతో టీడీపీతో పొత్తు ఉండదని ప్రచారం జరుగుతుంది.

ఇటు టీడీపీ సైతం పొత్తులతో సంబంధం లేకుండా…సొంతంగా బలపడేందుకు కష్టపడుతుంది. కానీ ఎంత కష్టపడిన ఎన్నికల సమయంలో జనసేనతో పొత్తు ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అటు పొత్తు  అనేది జనసేనకు కూడా ప్లస్సే. బీజేపీతో ముందుకెళితే పావలా ప్రయోజనం ఉండదు. గట్టిగా చూస్తే జనసేన 5 సీట్లు గెలిచిన గొప్పే. అదే టీడీపీతో పొత్తు ఉంటే పరిస్తితి వేరుగా ఉంటుంది. ఆ విషయం పవన్‌కు తెలుసు. అందుకే ఎన్నికల సమయంలో ఎలాగైనా టీడీపీతో కలిసి ముందుకెళ్ళేందుకే పవన్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాట మాటకు వైసీపీ విముక్త ఏపీ అని, వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్నారు. తాజాగా నాదెండ్ల మనోహర్ సైతం..అదే తరహలో మాట్లాడారు. వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలకుండా ఉండటమే తమ లక్ష్యమని, వైసీపీ విముక్త ఏపీకి అన్నీ పార్టీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక నాదెండ్ల మాటలు బట్టి చూస్తే టీడీపీతో జనసేన పొత్తు ఉండేలానే ఉంది.