బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారు..!

ఘోర ఓటమితో కుదేలై..మళ్ళీ పార్టీని నిలబెట్టలేరనే స్థితిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు…ఇదంతా 2019 ఎన్నికల తర్వాత సీన్. ఇంకా పార్టీని బాబు పైకి లేపలేరని అంతా అనుకున్నారు. పైగా వయసు కూడా మీద పడుతుంది..అటు లోకేష్‌కు నిలబెట్టే సత్తా లేదు. కాబట్టి ఇంకా టీడీపీ పని అయిపోయినట్లే అని మాట్లాడుకున్నారు. కానీ అనూహ్య పరిస్తితుల్లో చంద్రబాబు తన సత్తా తగ్గలేదని మరోసారి రుజువు చేసుకునే దిశగా వెళుతున్నారు. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చేసే పనులు పరోక్షంగా బాబు ఇమేజ్ పెంచేలా ఉన్నాయి. ఆయన ఎక్కడకైనా పర్యటనకు వెళుతుంటే ఎన్నిసార్లు అడ్డుకున్నారో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా ఆ పార్టీ నేతలని, కార్యకర్తలని ఎలా ఇబ్బందులు పెట్టారో తెలిసిందే. ఇలా చేయడం వల్ల టీడీపీ అణిచివేత ఎలా ఉందో తెలియదు గాని..ఇంకా ఆ పార్టీని పైకి లేపినట్లు అయింది. అంటే ఈ మూడున్నర ఏళ్లలో టీడీపీ పుంజుకోవడానికి వైసీపీ కూడా ఒక కారణం.

ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు గాని..పరోక్షంగా అది బాబుకే ప్లస్ అవుతుంది. తాజాగా కూడా నందిగామ, జగ్గయ్యపేటలో పర్యటించారు. ఇక బాబు రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్ళు రువ్వారు. దీని వల్ల బాబు సెక్యూరిటీకి గాయాలయ్యాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల బాబు ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందనుకుంటే పొరబాటే..ఇంకా ఆయన ఇమేజ్ పెంచేలా వైసీపీ చేస్తుంది.

అలాగే తాజాగా పర్యటనలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది..జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో బాబు రోడ్ షోకు ప్రజలు భారీగానే వచ్చారు. దీని బట్టి చూస్తే బాబుకు ఆదరణ పెరుగుతుందనే చెప్పొచ్చు. అలాగే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంకాస్త ఊపు వస్తుంది. ఇప్పటికే ఆ రెండు చోట్ల వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. దీంతో టీడీపీకి ఆటోమేటిక్‌గా ప్లస్ అవుతుంది.