నెల్లూరు టీడీపీలో యువనేతలు..నాలుగు స్థానాల్లో!

రాజకీయాల్లోకి యువత రావాలి..యువతకు ప్రాధాన్యత ఇస్తాం..వారికి అన్నీ సీట్లు ఇస్తాం..ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు..కానీ ఎప్పుడు ఆ దిశగా మాత్రం చంద్రబాబు ముందుకెళ్లలేదు. ఈ విషయంలో జగన్ ఇంకా ముందున్నారు. తమ పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువత వాళ్ళ మరో 20-30 ఏళ్ళు రాజకీయంగా బలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పుడు టి‌డి‌పిలో సీనియర్ నేతలు పెరిగిపోయారు. వారు గట్టిగా చూసుకుంటే ఇంకో 5 లేదా 10 ఏళ్ళు మాత్రమే రాజకీయాలు చేయగలరు..అందుకే ఈ సారి నుంచి యువ నేతలని ఎంకరేజ్ చేసే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. పార్టీలో నారా లోకేష్ హవా పెరుగుతున్న నేపథ్యంలో యువ నేతలకు ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు.

ఆ దిశగానే చంద్రబాబు ముందుకెళుతున్నారు..ఇప్పటికే పలు స్థానాల్లో ఇంచార్జ్‌లుగా యువ నేతలని పెట్టారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరులో నలుగురు యువ నేతలకు సీట్లు ఇస్తారని సమాచారం. వైసీపీ హవా ఉన్న నెల్లూరులో ఇప్పుడుప్పుడే టి‌డి‌పి పుంజుకుంటుంది. కానీ కొంతమంది సీనియర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొన్ని స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉంది. అందుకే కొన్ని స్థానాల్లో యువ నేతలకు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు.

ఇప్పటికే కోవూరు ఇంచార్జ్‌గా పొలంరెడ్డి దినేష్ రెడ్డిని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కోవూరు నుంచి దినేష్ పోటీ చేస్తారు. అటు ఆత్మకూరు సీటు నుంచి..ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి టి‌డి‌పి నుంచి బరిలో దిగనున్నారు. అటు ఉదయగిరి, నెల్లూరు రూరల్ సీట్లలో కూడా యువ నేతలని బరిలో దించుతారని తెలుస్తోంది. మొత్తానికి నెల్లూరులో టి‌డి‌పి నుంచి యువనేతలు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.