తాడిపత్రి హీట్..టార్గెట్ అస్మిత్..!

తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే నడుస్తాయి..గత ఎన్నికల దగ్గర నుంచి ఇక్కడ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు ఇంతవరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోలేదు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైంది. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి పెద్దారెడ్డిపై ఓడిపోయారు. ఓడిపోయాక తాడిపత్రి రాజకీయాలు మరింత మారాయి. మధ్యలో ప్రభాకర్, అస్మిత్‌లు కొన్ని కేసుల్లో జైలుకు వెళ్ళి రావడంతో, తాడిపత్రిలో రాజకీయం మరింత హీటిక్కింది.

అక్కడ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో దూకుడుగా రాజకీయం చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో అన్నీ మున్సిపాలిటీల్లో టీడీపీ ఓడిపోయిన తాడిపత్రిలో టీడీపీని గెలిచేలా చేశారు. అలాగే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యారు. ఇక ప్రభాకర్ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లు వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. జేసీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ, తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు.

టార్గెట్‌ అశ్మిత

ఇక ఇటీవలే అస్మిత్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ గా చంద్రబాబుని కలిసి వచ్చారు. తాడిపత్రిలోని పరిస్తితులని వివరించారు. ఇంకా దూకుడుగా పనిచేయాలని బాబు, అస్మిత్‌కు సూచించారు. ఈ క్రమంలోనే అస్మిత్ తాడిపత్రిలో తిరగడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీలోని 3వ వార్డులో పర్యటిస్తున్న సందర్భంగా కొందరు వైసీపీ నేతలు..అస్మిత్‌ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రాళ్ళతో దాడి చేశారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించాయి.

జేసీ రంగంలో దిగి ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అయితే అస్మిత్‌పై రాళ్ళ దాడి వల్ల పరోక్షంగా వైసీపీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. ఇప్పటికే తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పాజిటివ్ తక్కువ ఉంది..ఈ క్రమంలో అస్మిత్‌ని టార్గెట్ చేయడం వల్ల, వారికే సానుభూతి పెరిగి ఇంకా ప్లస్ అవుతుంది. మొత్తానికి తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిందని చెప్పొచ్చు.