జనసేన చేతుల్లోకి కాకినాడ..రెండు ఇచ్చేస్తారా?

అధికారికంగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా పొత్తు ఫిక్స్ అని రెండు పార్టీ శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవడంతో..రెండు పార్టీల పొత్తు దాదాపు సెట్ అయిపోయినట్లే అని భావించవచ్చు. కాకపోతే పొత్తు గురించి ఎన్నికల ముందు అధికారికంగా ప్రకటన ఇవ్వొచ్చు. అయితే పొత్తు అధికారికంగా వచ్చే లోపు..సీట్ల పంపకాలపై ప్రచారం గట్టిగానే సాగుతుంది.

జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇదే క్రమంలో కాకినాడ సీటు కూడా జనసేనకే దక్కుతుందని ప్రచారం వస్తుంది. కాకినాడకు సంబంధించి సిటీ, రూరల్ సీట్లు ఉన్నాయి. ఈ రెండు సీట్లు జనసేనకు ఇస్తారా? అనేది తెలియదు గాని..ఒకటి మాత్రం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అలా అని రెండు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే టీడీపీ అంత తేలికగా రెండు సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదు.

అయితే రెండు చోట్ల టీడీపీకి బలం ఉంది…అలాగే జనసేనకు కాస్త బలం ఉంది.  గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ఈ రెండు చోట్ల టీడీపీ ఓడిపోయింది. కాకినాడ సిటీలో టీడీపీపై వైసీపీ 14 వేల మెజారిటీతో గెలిస్తే ..అక్కడ జనసేనకు 30 వేల ఓట్లు వచ్చాయి. రూరల్‌లో టీడీపీపై వైసీపీ దాదాపు 9 వేల మెజారిటీతో గెలిస్తే..అక్కడ జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండుచోట్ల జనసేన ప్రభావం గట్టిగా ఉంది. కాకపోతే సిటీతో పోలిస్తే రూరల్‌లో బలం ఎక్కువ ఉంది.

పైగా రూరల్‌లో టీడీపీకి సరైన నాయకత్వం కూడా లేదు…కాబట్టి కాకినాడ రూరల్ సీటు జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. అయితే సిటీలో టీడీపీ నేత వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన స్ట్రాంగ్ లీడర్. ఆయనని కాదని జనసేనకు సీటు కేటాయించడం జరిగే పని కాదు. కాకపోతే జనసేన పట్టుబడితే సమీకరణ మారే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడ రూరల్ జనసేనకు, సిటీ టీడీపీకి అని చెప్పొచ్చు.