అనంతలో జనసేన..టీడీపీ త్యాగం?

టీడీపీ-జనసేన పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు గాని..పొత్తు గురించి అంతర్గతంగా మాత్రం చర్చలు నడుస్తున్నాయి. అలాగే జనసేనకు ఏ ఏ సీట్లు కేటాయిస్తారు…టీడీపీ ఏ సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతుంది..జనసేన ఏ సీట్లు అడుగుతుందనే అంశంపై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కథనాలు వస్తున్నాయి గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటన రావడం ఖాయం.

కాకపోతే ఇప్పుడే సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలోనే 22-25 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు జనసేనకు ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉందని, జనసేన ఏమో 40 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు అడుగుతుందని ప్రచారం వస్తుంది. మరి ఈ ప్రచారాల్లో ఏది నిజమో తెలియాలంటే..అధికారికంగా పొత్తు ప్రకటన వరకు వెయిట్ చేయాలి. అయితే ప్రస్తుతం ఏ జిల్లాలో జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వొచ్చు అనే దానిపై చర్చలు వస్తున్నాయి.

ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేనకు ఒకటి లేదా రెండు సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అనంతలో జనసేన ప్రభావం పెద్దగా లేదు. కేవలం అనంతపురం అర్బన్ సీటు, అలాగే గుంతకల్ సీటులో జనసేనకు కాస్త ఓట్లు బాగా పడ్డాయి. అనంతలో 10 వేల ఓట్లు, గుంతకల్‌లో దాదాపు 20 వేల ఓట్లు వచ్చాయి. ధర్మవరంలో 6 వేల ఓట్ల వరకు వచ్చాయి. అయితే అనంతలోని 14 సీట్లలో టీడీపీ నేతలు ఉన్నారు. ఏ సీటు కూడా ఖాళీ లేదు.

మరి అలాంటప్పుడు జనసేనకు ఏ సీటు కేటాయిస్తారనేది క్లారిటీ లేదు. కాకపోతే గుంతకల్ సీటులో టీడీపీ నేత జితేంద్ర గౌడ్ పెద్దగా పికప్ అవ్వలేదు..యాక్టివ్ గా ఉండటం లేదు. పైగా ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఈ సీటు జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. అటు అర్బన్ సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.