జగన్ మార్క్: ఎలక్షన్ టీంలో భారీ మార్పులు.!

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఓ వైపు ప్రజా బలం ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలని చెప్పి..ప్రజల్లోకి వెళుతూ, తమ ఎమ్మెల్యేలని ప్రజలని తిప్పుతున్న విషయం తెలిసిందే. 175కి 175 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా బలంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జిల్లాల అధ్యక్షులని భారీ స్థాయిలో మార్చారు.

ఇప్పటికే కొందరు జిల్లా అధ్యక్షుల తమ పదవుల నుంచి తప్పుకోగా, మరికొందరిని తప్పించి,కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షురాలు పదవి నుంచి మేకతోటి సుచరిత తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు బాధ్యతలు ఇచ్చారు. అటు అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి నుంచి కాపు రామచంద్రారెడ్డి తప్పుకోవడంతో, ఆ ప్లేస్‌లో పైలా నరసింహయ్యకు బాధ్యతలు ఇచ్చారు.

తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పారు. కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాలనాగిరెడ్డిని తప్పించి, కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అప్పగించారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను బుర్రా మధుసూధన యాదవ్ నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి కట్టబెట్టారు

చిత్తూరు జిల్లా బాధ్యతల నుంచి కుప్పం ఇంచార్జ్ భరత్‌ని తప్పించి, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, విశాఖలో అవంతి శ్రీనివాస్‌ని సైడ్ చేసి, పంచకర్ల రమేశ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. పార్వతీపురం జిల్లా బాధ్యతలని పుష్పశ్రీ వాణి భర్త పరిక్షిత్ రాజుకు ఇచ్చారు. అటు సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌లని రీజనల్ కొ ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించారు. మొత్తానికి ఎన్నికలకు సరికొత్త టీంతో వెళ్ళేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పార్టీలో పలు మార్పులు చేసే దిశగా జగన్ ముందుకెళ్లెలా ఉన్నారు.