లోకేష్‌పై గంజి..చెక్ పెట్టిన టీడీపీ..!

మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేసిన గంజి చిరంజీవి..ఆ మధ్య జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీలో తనకు న్యాయం జరగడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అలాగే టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. ఇక ఈయనే వచ్చే ఎన్నికల్లో లోకేష్‌పై వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా ప్రచారం ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా గుంటూరులో పద్మశాలి వర్గానికి సంబంధించి వన సమారాధన కార్యక్రమం జరిగింది. అయితే అందులో అన్నీ పార్టీలకు చెందినవారు ఉన్నారు..కానీ గంజి అక్కడ వైసీపీకి సంబంధించి స్పీచ్ ఇచ్చారు. లోకేష్‌పై విమర్శలు చేశారు..గతంలో ఆయన గెలుపు కోసం పనిచేశామని, ఇంకా ఆయన గెలవడని, వైసీపీనే గెలుస్తుందంటూ గంజి మాట్లాడారు. దీంతో వెంటనే అక్కడ అదే వర్గానికి చెందిన శ్రీనివాస్..టీడీపీ నాయకుడుగా…గంజిపై విరుచుకుపడ్డారు. దమ్మున్న వారు ఎవరైనా సరే మంగళగిరిలో లోకేష్‌పై పోటీ చేసి గెలవాలని, బీసీలకు న్యాయం చేసింది టీడీపీ అంటూ చెప్పుకొచ్చారు.

పిలవని పేరంటానికి గంజి చిరంజీవి వచ్చారని విమర్శించారు. పద్మశాలీలకు టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి శ్రీనివాస్ వివరించారు. దీంతో వైసీపీ నేత గంజి చిరంజీవి చినబుచ్చుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్‌కు చెక్ పెట్టాలని చెప్పి వైసీపీ..గంజిని లాగారు. ఇక వైసీపీలో ఆయనకు సీటు వస్తుందనే ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వేరే సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మంగళగిరిలో పద్మశాలిల ఓట్లు ఎక్కువ ఉండటంతో అదే వర్గానికి చెందిన గంజిని నిలబెట్టాలని చెప్పి జగన్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎవరు బరిలో నిలబడిన మంగళగిరిలో లోకేష్‌కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. బీసీ మంత్రం వేసిన వైసీపీని జనం నమ్మేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.