సిక్కోలులో ధర్మానకు రిస్క్..టీడీపీకి మైనస్..!

ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నేతలు ఎవరు ఉన్నారంటే వైసీపీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వారు ఉన్నారు. ఇక వీరు రాజకీయంగా అన్నీ పదవులు చూసేశారు..గెలుపోటములు చూశారు. ఇంకా రాజకీయాల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాము ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీనియర్లలో ఒకరిద్దరికే రిస్క్ ఉంది తప్ప..మిగిలిన వారికి పెద్ద రిస్క్ ఉండే అవకాశాలు లేవు. ఇక రిస్క్ ఎక్కువ ఉన్నవారిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారని చెప్పొచ్చు. రాజకీయంగా ఎంతో సీనియర్ అయిన ధర్మాన..కాంగ్రెస్‌లో అనేక ఏళ్ళు పనిచేశారు..ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న ధర్మాన..విశాఖ రాజధాని సెంటిమెంట్‌ని భుజాన వేసుకుని పనిచేస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా ఏమైనా హెల్ప్ అవుతుందనే కోణంలోనే ముందుకెళుతున్నారు. ఎందుకంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం అసెంబ్లీలో ధర్మానకు అనుకున్నంత ప్లస్ లేదు. గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గాని, మంత్రిగా గాని అక్కడ చేసే అభివృద్ధి శూన్యం. పైగా పలు వివాదాలు, భూ అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని సెంటిమెంట్ రగులుస్తున్నారు. ఇది కాస్త కలిసొస్తుందని అనుకుంటున్నారు.

కానీ విచిత్రమైన విషయం ఏంటంటే..అనేక ఏళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసిన ధర్మాన..ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశారంటే? ఏం చెప్పలేని పరిస్తితి. పోనీ ఇప్పుడు మంత్రిగా ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఈయన మంత్రిగా చేసింది ఏమి కనిపించడం లేదు..కానీ ఉత్తరాంధ్ర వెనుకపడిపోయిందని, విశాఖకు రాజధాని రావాలని ఉద్యమం లేపుతున్నారు. మరి ధర్మానని జనం ఎంతవరకు నమ్ముతారో చూడాలి. అయితే శ్రీకాకుళం స్థానంలో ధర్మానపై నెగిటివ్ ఉంది గాని..టీడీపీకి ప్లస్ కనిపించడం లేదు. కానీ జనసేనతో గాని టీడీపీ కలిస్తే..నెక్స్ట్ సిక్కొలులో ధర్మానకు గెలుపు కష్టం.