అఖిలప్రియకు బాబు హ్యాండ్…తేల్చేసినట్లేనా?

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆళ్లగడ్డ-నంద్యాల లాంటి నియోజకవర్గాల్లో సత్తా చాటుతున్న ఫ్యామిలీ. అయితే భూమా ఫ్యామిలీ వారసులు వచ్చాక రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు.

ఇప్పటికీ వారు పుంజుకున్నట్లు  కనిపించడంలేదు. ఇదే క్రమంలో సీట్ల విషయంలో వారి మధ్య అంతర్గత పోరు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు భూమా ఫ్యామిలీ సీట్ల విషయంలో నిర్ణయం మార్చుకునేలా ఉన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనతో అఖిలప్రియ విషయంలో బాబు దాదాపు క్లారిటీకి వచ్చేసినట్లే అని తెలుస్తోంది. బాబు పర్యటనలో బ్రహ్మానందరెడ్డి కనిపించారు గాని..అఖిల పెద్దగా కనిపించలేదు. పైగా అఖిల తీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి.

వాస్తవానికి బాబుని కలవడానికి అఖిల వస్తే…బాబు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఆ తర్వాత జిల్లాకు చెందిన ఇంచార్జ్‌ల సమావేశం జరిగితే అఖిల హాజరు కాలేదని తెలుస్తోంది. ఆ మధ్య తమది టికెట్ అడిగే స్థాయి కాదు..పది మందికి టికెట్ ఇచ్చే స్థాయి అంటూ అఖిల మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై బాబు సీరియస్ గా ఉన్నారని టాక్.

పైగా ఆళ్లగడ్డలో అఖిల పెద్దగా పుంజుకోలేదని సర్వేల్లో తేలిందట. ఈ క్రమంలో బాబు..అఖిలకు సీటు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. పైగా బీజేపీలో ఉంటూ సొంత ఇమేజ్ పెంచుకున్న భూమా కిషోర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అఖిల మాత్రం ఆళ్లగడ్డతో పాటు నంద్యాల సీటు తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ బాబు మాత్రం అఖిల సీటుకే ఎసరు పెట్టినట్లు సమాచారం. మొత్తానికి టీడీపీలో అఖిలని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది.