బాబు దూకుడు..ఎన్నికల హామీలు షురూ..!

ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉంది..కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్నారు. ఓ వైపు రోడ్ షోలు, మరో వైపు ఇంచార్జ్‌లతో భేటిలు, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం…ఇలా ఏ మాత్రం గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడానికి..ఇప్పటినుంచే ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేయని పనులు చెబుతూ, వచ్చే ఎన్నికల్లో తాము ఏం చేస్తామనే దానిపై హామీలు ఇస్తున్నారు. తాజాగా చంద్రబాబు..ఆక్వా రైతులకు హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆక్వా రంగం పలు ఇబ్బందుల్లో ఉంది..జగన్ ప్రభుత్వం ఆశించిన మేర ఆదుకోలేదు. దీంతో తాజాగా ఆక్వా రైతులతో సమావేశమైన బాబు..వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే..ఏ తేడా లేకుండా అవ్క రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తానని ప్రకటించారు.

అయితే గత ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు..కానీ జోన్‌ల విధానం తెచ్చి..కేవలం 20 శాతం మందికే రూపాయిన్నరకు ఇచ్చి, మిగిలిన 80 శాతం మంది నుంచి రూ.3.86 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరికీ రూపాయిన్నర అని ప్రకటించారు. అలాగే నాణ్యమైన మేతని, తక్కువ ధరలకే అందిస్తామని, జనరేటర్లు, డీజిల్ అవసరం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా, ఎరియేటర్లు, బోర్లు, మోటర్లని 50 శాతం సబ్సిడీకి, నీటిపన్ను, ఏ‌ఎం‌సి సెస్, ట్రాన్స్‌ఫార్మర్ల ధరలని పాత రేట్లకే అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇలా ఇప్పటినుంచే చంద్రబాబు ఎన్నికల హామీలు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ఇంకా రాను రాను ఇతర రంగాలకు సంబంధించి హామీలు కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి బాబు హామీలని ప్రజలు ఎంతవరకు నమ్మి, టీడీపీ వైపు మొగ్గుచూపుతారో చూడాలి.