పవన్‌తోనే భీమవరం..మారిన లెక్కలు..!

ఏపీ రాజకీయాల్లో భీమవరం నియోజకవర్గం అంటే అదొక ప్రత్యేకమైన స్థానంగా చూస్తారు..పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న ఈ స్థానంలో గెలుపోటములని మొదట నుంచి కాపు, క్షత్రియులే డిసైడ్ చేస్తారు. అయితే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే పవన్ కల్యాణ్..2019 ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలో కూడా పోటీ చేశారు. కానీ రెండు చోట్ల అనూహ్యంగా ఓడిపోయారు. భీమవరంలో సొంత వర్గం వారే పవన్‌కు పూర్తి స్థాయిలో ఓట్లు వేసినట్లు కనిపించలేదు. అందుకే భీమవరంలో ఓటమి ఎదురైంది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యే  గ్రంథి శ్రీనివాస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.

భీమవరం ప్రజలు సంక్షేమం కంటే అభివృద్ధి ఎక్కువ ఆశిస్తారు. ఈ మూడున్నర ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి శూన్యం..దీంతో ఎమ్మెల్యేకు పాజిటివ్ లేదు. అయితే ఇక్కడ రాజకీయం కేవలం పవన్ మీద ఆధారపడి ఉంది. మొదట టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..ఆ రెండు పార్టీల నుంచి ఎవరు నిలబడిన ఈజీగా గెలుస్తారు. ఇక పవన్ నిలబడితే..దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని అంటున్నారు.

పొత్తు లేకుండా త్రిముఖ పోరు జరిగితే..తక్కువ ఓట్ల మెజారిటీతో అయినా పవన్ గెలుస్తారని తెలుస్తోంది. అలా కాకుండా జనసేన నుంచి పవన్ కాకుండా వేరే నేత పోటీ చేస్తే..ఇక్కడ మళ్ళీ ఓట్లు చీలి వైసీపీకి మేలు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే సమయంలో జనసేన, వైసీపీ నుంచి కాపు అభ్యర్ధులు నిలబడి, టీడీపీ గాని క్షత్రియ అభ్యర్ధి నిలబడితే..కాస్త టీడీపీకి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

మొత్తం మీద చూసుకుంటే భీమవరంలో గెలుపోటములు పవన్ బట్టే మారనున్నాయి..ఆయన నిలబడితే గెలుపు ఈజీ. అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ గెలుపు కష్టం. పవన్ పోటీ చేయకుండా త్రిముఖ పోరు నడిస్తే..ఓట్లు చీలి వైసీపీకి మేలు జరుగుతుంది. అంటే భీమవరంలో రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు.