అదేం ఖర్మమో తెలియదు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్రజలు మనవైపు మొగ్గుతున్నారు.. అని భావించే సమయంలో బీజే పీలో పెద్ద ప్రకంపన మొదలవుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్పటి వరకు స్థానికంగా దూకుడు చూపించి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నాయకులు.. చతికిల పడుతున్నారు. అంతేకాదు.. ఇక ప్రజల ముందుకు ఎలా వెళ్లాలనే తపన చెందుతున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. “మేం ఎంతో కష్టపడుతున్నాం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం.
అయితే.. ఇంతలోనే.. కేంద్రం నుంచి రావడం.. నీళ్లు చల్లడం.. ఇదేం ఖర్మ“ అని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్తితిలోనూ ఏపీలో అధికారంలోకి రావాలని.. బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు నుంచి కన్నా లక్ష్మీనారాయణ వరకు.. అందరూకూడా.. పెద్ద ఎత్తున ప్రజల మద్య ఉంటుందన్నారు. వారిసమస్యలు వింటున్నారు. వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.
మరీ ముఖ్యంగా కొన్నాళ్లు ప్రజాపోరు పేరుతో.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలపై అంతో ఇంతో ఆత్మ విశ్వాసం పెరిగింది. నాయకులు కూడాచేరువ అవుతున్నారు. వివిధ కార్యక్రమాలతో ఒకే వేదికపై కనిపిస్తున్నారు. ఇంత చేస్తున్న రాష్ట్ర నాయకులకు కేంద్రం నుంచి వస్తున్న మంత్రులు కానీ.. బీజేపీ పెద్దలు కానీ.. ఎలాంటి దిశానిర్దేశం చేయకపో గా.. స్థానికంగా ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
గతంలో కేంద్రం నుంచి వచ్చిన మంత్రి ఎల్ . మురుగన్.. ఇక్కడ నాడు-నేడు కార్యక్రమాలను ఆకాశానికి ఎత్తేశారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా.. తాగు నీటి వసతులు బాగున్నాయని ప్రశంసించారు. నిజానికి ఆ సమయంలో సోము సహా నాయకులు అందరూ ఆయా సమస్యలపై పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే వారు ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్లు చేయడంతో రాష్ట్ర నాయకులు డంగయ్యారు.
ఇక, తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. చేసిన వ్యాఖ్యలు మరింతగా బీజేపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న గడపగడప పాదయాత్రను వెంకయ్య ప్రశంసించారు. చాలా బాగుందని అన్నారు. అంతేకాదు.. ఇది అందరూ అలవరుచుకోవాలని సూచించారు. నిజానికి తాజాగా బీజేపీ నేతలు నిర్వహించిన ప్రజాపోరు యాత్రల్లో గడపగడపపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని.. అన్నారు. మరి ఇలాంటి సమయంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు బీజేపీని గందరగోళంలోకి నెట్టేశాయి.