డబ్బింగ్ చేయకుండా ఓ సినిమాని 3 భాషల్లో డైరెక్ట్ గా తీసిన తెలుగు నిర్మాత ఎవరో తెలుసా?

ఒక భాషలో హిట్టైన సినిమాని ఇతర భాషల్లో డబ్ చేయడం పరిపాటి. అలాగే భాషలో బాగా ఆడిన సినిమాని ఇతర భాషలో రీమేక్ చేయడం కూడా సర్వ సాధారణమైన విషయం. అయితే అదే సినిమాని మూడు నాలుగు భాషల్లో రీమేక్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పుకోవాలి. అలాంటి ఘనత తెలుగులో ఒక్క నిర్మాతకు మాత్రమే వుంది అతనే మూవీ మొఘల్, డాక్టర్ డి.రామానాయుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు ఈయన. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించిన రామానాయుడు.. తన సంస్థ ద్వారా ఎంతో మంది నూతన నటీనటులు, దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ క్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు్ల్లో ఆయన పేరు చేరింది. దేశంలోని 13 భాషల్లో 150కిపైగా చిత్రాలను ఆయన నిర్మించారు. కాగా, ఒక చిత్రం విషయంలో రామానాయుడు అరుదైన రికార్డు సాధించారు. ఆ చిత్రాన్ని రామానాయుడు మొదట తెలుగులో తీశారు. ఆ తర్వాత తమిళ్, ఆ తర్వాత హిందీలో తీసి అన్ని భాషల్లో ఘన విజయం సాధించారు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా విజయం సాధించడం విశేషం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం ‘ప్రేమ్ నగర్’ ఆ ఘనత దక్కించుకుంది.

అవును, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని తమిళ్ భాషలో సేమ్ డైరెక్టర్ తో మళ్లీ తీశారు ప్రొడ్యూసర్ రామానాయుడు. కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వంలో శివాజీ గణేశన్ హీరోగా ‘వసంత మలిగై’ అనే టైటిల్ తో తీసి హిట్టు కొట్టారు. ఇక ఆ తర్వాత ఇదే చిత్రాన్ని రామానాయుడు హిందీలో ‘ప్రేమ్ నగర్’ అనే టైటిల్ తో తీశారు. రాజేశ్ ఖన్నా, హేమా మాలిని హీరో, హీరోయిన్లుగా నటించగా, సేమ్ దర్శకుడు కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వం వహించారు. అలా ఒకే చిత్రాన్ని ఒకే దర్శకుడితో మూడు భాషల్లో తీయించి అరుదైన విజయం అందుకున్నారు మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు.