రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర భాషల సినిమా పరిశ్రమలకు చెందిన వారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు కూడా కృష్ణంరాజుకు సంతాపం తెలుపుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా అంతా సంతాపాలతో హోరెత్తుతుంది. కృష్ణంరాజుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు – పవన్ – చిరంజీవి ఇలా చాలామంది ఇప్పటికే కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించి వచ్చారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్ళని హీరోలు అందరూ సోషల్ మీడియాలో తమ సంతాపం తెలుపుతున్నారు. వీరందరూ ఇలా చేస్తుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. కృష్ణంరాజు మరణం వార్తా తెలిసిన తర్వాత కూడా సైమా అవార్డుల ఫంక్షన్ లో తాను ఇచ్చిన పార్టీ వీడియోను బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేయటం విమర్శలకు దారితీస్తోంది.
పోనీ ఈ వీడియోకు ముందు లేదా ఆ తర్వాత అయినా.. బన్నీ కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం ప్రకటించి ఉంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. అయితే బన్నీ ఓవైపు ఇండస్ట్రీ అంతా కృష్ణంరాజు మరణంతో బాధలో ఉంటే.. తాను ఇచ్చిన పార్టీ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. బన్నీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి బన్నీ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.