గుడివాడ టీడీపీని లేపుతున్న కొడాలి..?

గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే సంగతి తెలిసిందే…అలాగే ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు అని కూడా తెలుసు…తన మాటలతో టీడీపీపై విరుచుకుపడతారు. అలాగే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని దారుణంగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే. మరి ఈయన తిట్టడం వల్ల వైసీపీకి ఎంత లాభం జరుగుతుందో తెలియదు గాని…పరోక్షంగా టీడీపీని మాత్రం పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు కొడాలి విమర్శలు…కాదు కాదు బూతులు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలుసు. తాజాగా కూడా కొడాలి నాని తన నోటికి పనిచెప్పారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతితో కలిసి వ్యాపారం చేసే వాళ్ళ పేరులు వినిపించాయని బీజేపీ ఆరోపించింది…ఈ విషయాన్ని టీడీపీ ప్రస్తావించింది. ఇందులో ఎక్కడా వ్యక్తిగతమైన విమర్శలు లేవు. కానీ దీనిపై జగన్ సీరియస్ అయ్యి…మంత్రులు టీడీపీకి కౌంటర్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. సరిగ్గా కౌంటర్లు ఇవ్వకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి..చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కొందరు మహిళా నేతలైతే భువనేశ్వరి, బ్రాహ్మణిల గురించి దారుణంగా మాట్లాడారు. పనిలో పనిగా కొడాలి నాని..మళ్ళీ తనదైన శైలిలో బాబు, లోకేష్‌లని బూతులు తిట్టారు. ఇక లోకేష్ పుట్టుక గురించి కూడా తీసి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా దూకుడుగా కొడాలి, జగన్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా ఈ మధ్య తక్కువ యాక్టివ్ గా ఉంటున్న కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఒక్కసారి యాక్టివ్ అయ్యారు. అందరూ ఛలో గుడివాడ అంటూ కొడాలిపై ఫైర్ అయ్యారు. కొందరిని పోలీసులు అడ్డుకోగా, మరికొందరు గుడివాడ వెళ్ళి అక్కడ భారీగా ర్యాలీగా రావి వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొడాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు అధికారం కోల్పోయాక గుడివాడ టౌన్‌లో రావి నేతృత్వంలో టీడీపీ ఈ స్థాయిలో ర్యాలీ ఎప్పుడు చేయలేదు. కొడాలి నాని పుణ్యమా అని గుడివాడలో టీడీపీ దూకుడు పెంచింది. మరి కొడాలి వల్ల వైసీపీకి ఎంత లాభమో తెలియదు గాని, టీడీపీకి మాత్రం ప్లస్ అవుతున్నారు.