విశాఖ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నర్సీపట్నం ఎప్పుడూ చర్చల్లోకి వస్తున్న విషయం తెలి సిందే. రాజకీయ దిగ్గజం.. టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కేంద్రంగా ఇక్కడ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన తరచుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ను.. ఏకంగా.. ఆడు..ఈడు.. అంటూ.. దూషిస్తున్నారనేది వైసీపీ నేతల విమర్శ. ఈ క్రమంలో అయ్యన్నను ఘోరంగా ఓడించాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు.. తన నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయడంతోపాటు.. ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తుకు గండి కొడుతుందోనని.. అయ్యన్న కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా తన ఆస్తులపై ప్రభుత్వం కన్నేయడం.. వాటిని ధ్వంసం చేయాలని పక్కా వ్యూహంతో ముందుకు సాగిన విషయాన్ని అయ్యన్న జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే.. తను కూడా ఇక్కడ వైసీపీని మట్టి కరిపించాలని అయ్యన్న చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నర్సీపట్నం రాజకీయాలు రోజుకోరకంగా.. హాటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, పెట్ల ఉమాశంకర్ గణేష్ ( ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు) కూడా.. ఇప్పటి నుంచి వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. అయ్యన్న వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకువారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం.. వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం చేస్తున్నారనేది అయ్యన్న వర్గం చెబుతున్న మాట.
మరోవైపు.. యూత్ను కూడా పెట్ల ఆకర్షిస్తున్నారు. అయ్యన్న వయసు అయిపోయిందని.. ఆయన కుమారుడు దేనికీ పనికిరాడని.. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్లో ఆయన వ్యాఖ్యానించిన వీడియో.. తెగ వైరల్ అవుతోంది. అంటే.. మొత్తంగా నర్సీపట్నంలో.. వైసీపీ, టీడీపీలు.. ద్విముఖ వ్యూహంతో ఇక్కడ కత్తులునూరుతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.