అవనిగడ్డలో అంబటి..సింహాద్రి ఎటు?

ఈ మధ్య వైసీపీలో భారీగా సీట్ల మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని ప్రకటించిన జగన్…ఈ మధ్య తాడికొండ నియోజకవర్గంలో మార్పు చేశారు…ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే, అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించారు. దీని బట్టి నెక్స్ట్ తాడికొండ సీటు డొక్కాకే అని అర్ధమవుతుంది. అలాగే ఇంకా పలు సీట్లలో జగన్ మార్పులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో మళ్ళీ నారా లోకేష్‌కు చెక్ పెట్టడం కోసం మంగళగిరి సీటుని ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీసీ నేత గంజి చిరంజీవులుకు ఇస్తారని తెలిసింది. అలాగే వరుసగా మంగళగిరిలో గెలుస్తూ వస్తున్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని సత్తెనపల్లికి పంపిస్తారని కథనాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సత్తెనపల్లి సిట్టింగ్‌గా ఉన్న మంత్రి అంబటి రాంబాబుని…పక్కనే కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ నియోజకవర్గానికి పంపిస్తారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇదంతా జరుగుతుందో లేదో క్లారిటీ లేదు..కానీ ప్రస్తుతం వైసీపీలో నడుస్తున్న ప్రచారం బట్టి చూస్తే మార్పులు ఖచ్చితంగా జరిగేలా ఉన్నాయి. ఎందుకంటే మంగళగిరిలో ఆళ్ళకు, సత్తెనపల్లిలో అంబటికి వ్యతిరేకత కనిపిస్తోంది..అందుకే వీరి సీట్లు మారుస్తున్నట్లు తెలుస్తోంది. సరే అంబటి అవనిగడ్డకు వెళితే…మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. అక్కడ సింహాద్రికి కూడా పాజిటివ్ లేదు.

పైగా వరుసగా రెండుసార్లు ఓడిపోయి…మూడోసారి గెలిచారు. అలా గెలిచినప్పుడు మంచిగా పనిచేస్తే ఇబ్బంది ఉండేది కాదు…కానీ సింహాద్రి అనుకున్న స్థాయిలో అవనిగడ్డలో పనిచేసినట్లు లేరు. అందుకే ఇప్పుడు సీటుకే ఎసరు వచ్చిన పరిస్తితి. అయితే సింహాద్రిని వేరే సీటుకు పంపించే అవకాశాలు కూడా లేవు. అంటే అంబటి..అవనిగడ్డకు వస్తే…సింహాద్రికి సీటు లేనట్లే.