మళ్ళీ మొదలు…బాబు సీటు చేంజ్..!

ఎప్పుడైతే కుప్పం లో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే కాకుండా..కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుందో అప్పటినుంచి..కుప్పంలో చంద్రబాబు ఈ సారి గెలిచే అవకాశాలు లేవని, ఇంకా ఆయన పని అయిపోయిందని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కుప్పంలో బాబుని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు. అయితే ఏదేమైనా గాని వైసీపీ వల్ల కుప్పంలో బాబుకు కాస్త డ్యామేజ్ అయిన మాట వాస్తవం.

అందుకే బాబు వెంటనే అలెర్ట్ అయ్యి..కుప్పంలో పార్టీ పరిస్తితిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా కుప్పం వెళ్ళి..అక్కడ మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల జగన్ సైతం కుప్పం టూరుకు వెళ్లారు. అక్కడ భారీ స్థాయిలో సభ నడిచింది. అదిగో ఈ దెబ్బతో బాబు పని అయిపోయిందనే కుప్పం నుంచే తమ టార్గెట్ మొదలైందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

అయితే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు కుప్పం కోటని ఈజీగా కూల్చడం కష్టం. దశాబ్దాల పాటు బాబుపై ఉన్న అభిమానాన్ని అక్కడి ప్రజలు మార్చుకునే పరిస్తితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంత ట్రై చేసిన బాబుకు చెక్ పెట్టడం అనేది కష్టమైన పని అని, ఇప్పుడంటే అధికార బలం ఉంది కాబట్టి వైసీపీదే పైచేయి అన్నట్లుగా ఉందని, కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే కుప్పంలో బాబు పని అయిపోయిందని వైసీపీ నేతలు అంటే..ఇక ఆ సీటులో బాబు పోటీ చేయడం జరిగే పని కాదని, లేదా కుప్పంతో మరొక సీటులో కూడా పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పెనమలూరు అని, భీమిలి అని పలు సీట్లలో బాబు పోటీ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. తాజాగా కళ్యాణదుర్గంలో పోటీ చేస్తారని కొత్త కథ మొదలైంది. అసలు ఎట్టి పరిస్తితుల్లోనూ బాబు సీటు మారే ప్రసక్తి లేదని టీడీపీ వర్గాలు తేల్చి చెప్పేస్తున్నాయి. కుప్పంలోనే పోటీ చేసి ఎనిమిదో సారి గెలుస్తారని అంటున్నారు.