ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!

ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి.

ఇందులో మొదట కేశినేని నాని గురించి మాట్లాడుకోవాలి…ఈయన 2019 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ప్రత్యర్ధి పార్టీపై ఎంత ఫైర్ అయ్యారో తెలియదు గాని,..సొంత పార్టీపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. ఇప్పటికీ టీడీపీలో ఆయన వ్యవహారం కాస్త ఇబ్బందిగానే ఉంది. తాజాగా ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు బొకే ఇచ్చే విషయంలో కూడా నాని..వివాదాస్పదం అయ్యారు. ఇక ఈయన టీడీపీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది క్లారిటీ రావడం లేదు.

అటు రామ్మోహన్ నాయుడు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు…కానీ ఆయన ఈ మధ్య…అసెంబ్లీ సీటుపై మనసు పడ్డట్టు కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి పోటీ చేయాలని రామ్మోహన్ చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్మోహన్ కూడా అసెంబ్లీ బరిలో ఉంటే…అచ్చెన్నాయుడుకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ లేదు.

ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం కూడా కాస్త భిన్నంగానే ఉంది…ఈయన టీడీపీలో అంత యాక్టివ్ గా ఉండటం లేదు. పైగా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి రాజకీయాల నుంచి తప్పుకున్నారు…అలాగే తన ఫ్యామిలీ సభ్యులు, అనుచరులు నచ్చిన పార్టీలోకి వెళ్లొచ్చని మాట్లాడారు. దీంతో గల్లా వ్యవహారం ఏంటి అనేది తెలియడం లేదు. పైగా ఆయన కూడా ఏదైనా అసెంబ్లీలో పోటీ చేయాలని చూస్తున్నారని టాక్. ఈ విధంగా ముగ్గురు ఎంపీలకు..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. మరి చివరికి ముగ్గురు ఎంపీల రాజకీయ భవిష్యత్ ఎటువైపు తిరుగుతుందో చూడాలి.