చినబాబుకు షాక్..మంగళగిరిలో రివర్స్?

తొలిసారి ఎన్నికల బరిలో దిగి…ఓటమి పాలైన దగ్గర నుంచి…మళ్ళీ అదేచోట గెలిచి తీరాలని చెప్పి నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు వారసుడుగా బరిలో దిగిన లోకేష్ విజయంపై 2019 ఎన్నికల్లో పెద్ద చర్చ నడిచింది…ఆయన విజయం దాదాపు ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి బరిలో దిగి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక ఓడిపోయిన దగ్గర నుంచి అదే స్థానంలో గెలిచి తీరాలనే కసితో చినబాబు పనిచేస్తున్నారు. చాలాసార్లు ఆయన నియోజకవర్గానికి మార్చుకోవచ్చు అని ప్రచారం జరిగింది గాని…అయినా సరే ఆయన ఎప్పటికప్పుడు మంగళగిరి ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు…అక్కడ ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఈ మూడేళ్లలో చాలావరకు లోకేష్ పుంజుకున్నారు…అలాగే రాజధాని అమరావతి అంశం కూడా కలిసొస్తుంది. ఈ సారి మంగళగిరిలో లోకేష్ గెలవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి పరిస్తితుల్లో లోకేష్ కు..మంగళగిరిలో ఏదొక రూపంలో షాక్ తగులుతూనే ఉంది. ఆ మధ్య మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టీడీపెకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆయన సీనియర్ నేత కావడంతో…ఆయనకు పెద్ద ఫాలోయింగ్ ఉండదని, ఆయన వల్ల నష్టం జరగదని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ తాజాగా నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీని వీడారు.

మంగళగిరిలో చిరంజీవికి కాస్త ఫాలోయింగ్ ఉంది…ముఖ్యంగా ఈయనకు చేనేత వర్గంలో మద్ధతు ఎక్కువ. 2014 ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో లోకేష్ కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది..అయినా సరే పార్టీ కోసం కష్టపడుతున్నా సరే…తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి గంజి టీడీపీని వీడారు. సొంత పార్టీ నేతలే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదని, బీసీల సీటుని లాక్కున్నారని ఫైర్ అయ్యారు. అయితే గంజి ఏ పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ లేదు. వైసీపీలోకి వెళ్ళినా సీటు దక్కదు..అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. అంటే వైసీపీలో కూడా బీసీ నాయకుడుకు సీటు లేదు. మొత్తానికైతే గంజి పార్టీని వీడటం..మంగళగిరిలో లోకేష్ కు కాస్త నష్టమని చెప్పొచ్చు.