మద్యం మత్తులో ప్రాణాలు పోతాయి అంటే ఎవరు నమ్మరు. చాలామంది అదే పనిగా మందు తాగుతూ ఆనందిస్తుంటారు. అలా మందు తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేడివేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మధురై లోని పలాంగానట్టిలో జరిగింది. పలంగా నట్టిలో గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానం కోసం వంటలు చేస్తుండగా ఆ ప్రాంతానికి మద్యం సేవించి మత్తులో తూలుతూ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు.
అక్కడకు వచ్చిన కుమార్ తూలుతూ గోడ అనుకుని అన్నదానం కోసం జరుగుతున్న వంటశాలలో ఉన్న సాంబార్ గిన్నె దగ్గరకు వచ్చాడు. ఆ మత్తులో తెలియకుండా సలసలా మరుగుతోన్న సాంబార్ గిన్నెలో పడిపోయాడు. తరవాత లేవటానికి ప్రయత్నించిన వీలు కాలేదు. పక్కనే ఉన్న వారు వచ్చి అతడిని బయటికి తీయడానికి ప్రయత్నించినా.. ఆ సాంబార్ వేడి కారణంగా తమ మీద సాంబార్ పడుతుందని వారికి భయం కలిగింది.
అతడిని బయటికి తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. చివరకు అతడి కాళ్లు, జుట్టు, చేతులు పట్టుకుని బయటకు లాగారు. కానీ వారి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడ ఏమీ చేయలేక సాంబార్ గిన్నెను బయటికి నెట్టేశారు. ఆ గిన్నె కింద పడటంతో ఆ వ్యక్తి బయటపడ్డాడు. అప్పటికే ఆ వ్యక్తికి ఒళ్ళు మొత్తంం గాయాలయ్యాయి. అప్పుడు అక్కడ ఉన్నవారు అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.