బాబు-పవన్ కోసం బండ్ల..!

సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి.

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..తనదైన శైలిలో సవాళ్ళు చేసి అందరిని ఆకట్టుకున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం, మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో బండ్ల అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు.

కాకపోతే అప్పుడప్పుడు రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు…తెలంగాణకు చెందిన ఈయన…ఏపీలో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు…అటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏదొక సంచలనానికి తెరతీసే బండ్ల..తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు. ఇటీవల రాంబాబు..పవన్ కల్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి కౌంటర్ గా బండ్ల తనదైన శైలిలో రాంబాబుపై ఫైర్ అయ్యారు.

అలాగే ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి, పేర్ని నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ లపై ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు-పవన్ లకు సపోర్ట్ గా మాట్లాడారు. అసలు పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే అంబతికి ఎందుకని ప్రశ్నించారు. 2004లో చంద్రబాబుని ఓడించడానికి వైఎస్సార్…టీఆర్ఎస్, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, ఎం‌ఐ‌ఎం పార్టీలు కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు. అంటే నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే తప్పు ఏంటి అన్నట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికి బాబు-పవన్ కోసం బండ్ల గట్టిగానే కష్టపడుతున్నారు.