ఔను! తప్పు నాది కాదు..ఎమ్మెల్యేలదే!- అని కుండబద్దలు కొట్టేశారు.. వైసీపీ అధినేత జగన్. స్వయంగా తాను ఈ విషయాన్ని వెల్లడించకపోయినా.. మాజీ మంత్రులు.. నాయకులతో ఆయన తన మాటగానే చెప్పించారు. దీంతో ఇప్పటి వరకు “మా ఎమ్మెల్యే తప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన పరిణామం కాదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే మరింత బలహీనం అవుతారని అంటున్నారు పరిశీలకులు.
ఏం జరిగిందంటే.. గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం.. అనేక మంది కార్యకర్తలను నియమించు కుని పనిచేయించుకుంది. వారిని ఇంటింటికి పంపించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తెలు సుకుంది. ఇలా కార్యకర్తలను అన్నిరూపాల్లోనూ వినియోగించుకున్న వైసీపీ.. అప్పట్లో వారికి అనేక హామీ లు కూడా ఇచ్చింది. మేలు చేస్తామని.. ప్రభుత్వం ఏర్పడగానే ప్రథమ ప్రాధాన్యం వారికే ఉంటుందని కూడా చెప్పింది. అయితే.. ఇలా జరగలేదు.
ఎక్కడా కార్యకర్తలను పట్టించుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకుని వారిని వదిలేశారనే వాదన ఉంది. కనీసం.. ప్రభుత్వం నుంచి అందే పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా వారిని పట్టించుకుంటున్న నాధుడు కనిపించడం లేదు. పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక దన్ను కూడా వారికి అందడం లదేఉ. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ తఢాకా చూపిస్తామంటూ.. కర్నూలు, అనంతపురం, గుంటూరుకు చెందిన కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిపోయిన.. అధిష్టానం.. తమ తప్పులేదని.. అంతా ఎమ్మెల్యేలదేనని చెప్పుకొనే ప్రయత్నాలు చేసింది. తాజాగా ప్లీనరీలో మాజీ మంత్రి పేర్ని నాని.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు కూడా పవర్ లేదని గుసగుస వినిపిస్తోంది. అంతా వలంటీర్లు.. -ప్రభుత్వమే చూసుకుంటున్నప్పుడు.. తాము మాత్రం ఏం చేయగలమని.. పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమను తప్పుడు నాయకులు చేయడం మినహా ఇంకొకటి లేదని అంటున్నారు.