టాలీవుడ్లో షురూ కాబోతున్న సరికొత్త కాంబినేషన్లు ఇవే!

ఇండియాలో టాలీవుడ్ హవా కొనసాగుతోంది. అవును… ముఖ్యంగా కరోనా తరువాత కుదేలైన వివిధ సినిమా పరిశ్రములు ఇంకా పుంజుకోలేదు. కానీ మన దగ్గర అడపాదడపా సినిమాలు ఆడటం కొసమెరుపు. బయటకు కనబడట్లేదు గాని వివిధ సినీ పరిశ్రమలవారు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్! గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా సంతృప్తి పరచలేదు. ఓ రెండు సినిమాలు ఆడినా, వసూళ్లపరంగా అంత గొప్ప వసూళ్లు రాబట్టలేదు. ఈ విషయమై కొంతమంది ప్రముఖులు డైరెక్ట్ గా మీడియా ముందే తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.

ఇలాంటి తరుణంలో తెలుసు సినిమా తన సత్తాని చాటుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ రచయితలు, దర్శకులు తమ కలానికి మరింత పదునుపెట్టి సరికొత్త కథలతో వస్తున్నారు. వాటితో హీరోలను మెప్పిస్తూ కొత్త కాంబినేషన్స్ కు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల ‘థాంక్యూ’ సినిమాతో పలకరించిన అక్కినేని నాగచైతన్య.. తాజాగా తమిళ దర్శకుడు “వెంకట్ ప్రభు” తో ఓ ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేయడం విశేషం. ఇదే క్రమంలో ‘సర్కారు వారి పాట’ ఫేమ్ పరశురాం పెట్లా తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కలిసి ‘ఏజెంట్’ అనే పాన్ ఇండియా మూవీతో రాబోతున్న యూత్ కింగ్ అఖిల్ అక్కినేని.. ‘వకీల్ సాబ్’ ఫేమ్ “శ్రీరామ్ వేణు” దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దీనికి ‘తమ్ముడు’ అనే టైటిల్ ని రిజస్టర్ చేసారని వినికిడి. ఇక ‘మాచర్ల నియోజవర్గం’ సినిమాని రిలీజ్ కు లైన్లో పెట్టిన స్టార్ నితిన్.. దర్శక రచయిత వక్కంతం వంశీ తో ఓ సినిమా చేయనున్నాడు. దీని తర్వాత ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్ కె.చంద్ర తో నితిన్ చేయనున్నాడని టాక్. అలాగే ప్రస్తుతం సుకుమార్ బ్యానర్ లో ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటిస్తున్న మెగా మేనల్లుడు సాయితేజ్.. త్వరలో సంపత్ నంది తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇలా కొత్త కొత్త కాంబినేషన్లు త్వరలో అలరించనున్నాయి.