వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కమ్మ వర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత.. సీఎం జగన్ పక్కన పెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనే నరసరావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవరాయులు. యువ నాయకుడిగా.. విద్యావేత్తగా మంచి పేరున్న లావు.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయన భారీ మెజారిటీ కూడా నమోదు చేశారు. అయితే.. ఆయన అనతి కాలంలో నే పార్టీ నేతలకు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది.
ముఖ్యంగా పేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఆయనకు సఖ్యత లేదు. పైగా వివాదాలు కూడా ఉన్నాయి. సత్తెనపల్లి, వినుకొండ, గురజాల ఎమ్మెల్యేల తో ఆయన వివాదాలు సాగుతున్నాయి. ఈ ఘర్షణలు ఏకంగా..తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుకున్న సందర్భాలు కూడా.. ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక సార్లు.. ఫిర్యాదులు అందాయి. దీంతో జగన్.. లావును కొంత మేరకు దూరం పెట్టారనే వాదన వినిపిస్తోంది.
ఇక, మరోవైపు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడాకావడం.. మరోకారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్.. కమ్మలను దూరం పెడుతున్నారు. పైగా.. టీడీపీతో టచ్లో ఉన్నారని భావిస్తున్న లావును మరింత దూరం పెట్టారనే వాదన ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ నేతలు, సర్కారు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన.. అమరావతి రాజధాని విషయంలో లావు.. అనుకూలంగా వ్యవహరించ డం.. సీఎంకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈకారణంగానే లావును పక్కన పెట్టారనే గుసగుస వినిపిస్తోంది.
సామాజిక సమీకరణల పరంగా కూడా.. లావు సిఫారసులకు.. సీఎం జగన్.. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే.. మర్రి రాజశేఖర్కు సైతం.. ఎలాంటి పదవీ ఇవ్వలేదని .. తెలిసింది. ఈయనకు ఏదైనా పదవి ఇవ్వాలని.. కొన్నాళ్లుగా లావు సిఫారసుచేశారు. కానీ, ఇప్పటి వరకు జగన్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే లావు..ఇక, వైసీపీకి దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే ఆయన తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలకు టచ్లో కి వస్తున్నారని.. అంటున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.