టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా ? ఆ ఆఫర్ గొప్పదే అయినా మెగాస్టార్ దానిని తోసిపుచ్చారా ? చిరు ఆ ఆఫర్ వద్దనుకున్నాకే ఆ ఆఫర్ మరో వ్యక్తికి వెళ్లిందా ? అంటే ఎస్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ ఆఫర్ ఏంటో కాదు మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపడమే ఆ ఆఫర్. అయితే ఇప్పటికే రాజకీయాలు వదిలేసుకుని.. మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటోన్న చిరంజీవి చాలా మర్యాదగా ఆ ఆఫర్ ను తిరస్కరించారని అనుకుంటున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండేళ్లకే దానిని కాంగ్రెస్లో కలిపేసి ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా పదవినీ పొందరు. తన ప్రజారాజ్యం జట్టుగా ఉన్న వాళ్లంతా కకావికలు అయిపోయాక ఈ జీవితానికి ఇక రాజకీయం చాలనుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటున్నారు. అసలు ఆయన తన పార్టీని విలీనం చేసినా కూడా కాంగ్రెసు పార్టీ కూడా ఆయనను ఎప్పుడో మరచిపోయింది.
తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా చిరు దానికి దూరంగా ఉంటూ అందరు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు చిరుకు అల్లూరి విగ్రహావిష్కరణ సభలో మోడీతో కలిసి పాల్గొనడానికి ఆహ్వానించడం ఒక పెద్ద విశేషం. చిరుకు మోదీయే స్వయంగా రాజ్యసభ ఆఫర్ ఇచ్చారట. జీవీఎల్. నరసింహారావు, కిషన్ రెడ్డి లాంటి వాళ్లు ఇదే విషయమై మంతనాలు కూడా జరిపారట.
అయితే ఈ పరిస్థితుల్లో చిరుకు తనపై బీజేపీ ముద్ర వేయించుకోవడం ఇష్టం లేకే ఆ ఆఫర్ వదులుకున్నారని అంటున్నారు. చిరుతో కాపుల ఓటు బ్యాంకును టార్గెట్ చేయాలని బిజేపీ అనుకుంది. ఆయన ఆ ఆఫర్ వదులుకోవడంతోనే విజయేంద్ర ప్రసాద్కు వెళ్లిందంటున్నారు.