“రాజకీయాలంటే.. ఆషామాషీ కాదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టం“ తరచుగా.. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పే మాట. అయితే.. ఇన్ని కష్టాలు ఉండి కూడా ఎందుకు పార్టీని నడపడం .. అనేది విపక్షాల ఎదురు ప్రశ్న. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. నిజంగానే అన్ని కష్టాలు ఉండి కూడా పార్టీ నడుపుతున్న జనసేనాని.. పార్టీ అంటే.. ఏంటి? అనేది ఇప్పటి వరకు అర్ధం చేసుకోలేక పోయారనేది విశ్లేషకుల వాదన.
ఇదేంటి? చిత్రంగా ఉంది? అంటున్నారా? ఔను.. ఎందుకంటే.. ఇతర పార్టీల విషయాన్ని తీసుకుంటే.. అధినేత+ నాయకులు+ కార్యకర్తలు= పార్టీ. ఆ ఫార్ములానే అన్ని పార్టీల నేతలు కూడా అవలంబిస్తున్నా రు. అయితే.. దీనిలో ఒకటి రెండుచిన్నపాటి తేడాలు ఉన్నప్పటికీ.. మొత్తంగా అయితే.. పార్టీని నడిపిస్తు న్న తీరు.. సూత్రం కూడా ఇదే కావడం గమనార్హం. అయితే.. జనసేన విషయానికి వస్తే.. పవర్ స్టార్+ పవన్+ జనసేనాని = పార్టీ అన్నట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా పార్టీలో ఎవరూ కీలక నేతలు లేరు. ఉన్న ఒకరిద్దరిలో నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాత్రమే పైకి కనిపిస్తున్నారు. వీరిలోనూ.. నాగబాబుకు సబ్జెక్ట్ లేదనే వాదన పార్టీలోనే వినిపిస్తుంటుంది. ఇక, నాదెండ్ల ఏం మాట్లాడాలన్నా.. సదరు స్క్రిప్టును వాట్సాప్ చేసి.. పవన్ ఓకే అన్నాక కానీ.. ఆయన మాట్లాడే పరిస్థితి లేదని.. పెద్ద ఎత్తున పార్టీలోనే గుస గుస వుంది. అయితే.. ఇంతా జరిగాక.. నాదెండ్ల మీడియా ముందుకు వచ్చినా.. అప్పటికే పుణ్య కాలం గడిచి పోయి.. సదరు సబ్జెక్టుకు కాలగ్రహణం పడుతోంది.
ఇక, క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను ఎవరు మోస్తున్నారంటే.. కార్యకర్తలు కాదు. పవన్ అభిమానులు. ఈ అభిమానులు.. వచ్చే ఎన్నికల్లోఅయినా.. ఓట్లు వేస్తారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక, ఏతావాతా ఎలా చూసుకున్నా.. పార్టీలో క్షేత్రస్థాయిలో నాయకులు లేరు. మేధావులు అసలే లేరు. ఉన్నా మాట్లాడరు. ఇక, కార్యకర్తల మాట గురించి పార్టీ ఎప్పుడో మరిచిపోయిందనే వాదన ఉండదనే ఉంది. వెరసి మొత్తంగా రాజకీయ పద్మవ్యూహంలో జనసేన చిక్కులు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు పరిశీలకులు.