త్రివిక్రమ్‌కు డెడ్‌లైన్ పెట్టిన మహేష్..?

సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి సర్కారు వారి పాట టైటిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడంతో పాటు అంతే త్వరగా ఫినిష్ చేయాలన మహేష్ చిత్ర యూనిట్‌కు టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాధారణంగా మహేష్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది. కానీ త్రివిక్రమ్‌తో తన సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలని ఆయన కోరాడట. అయితే దీనికి బలమైన కారణం కూడా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రారంభించే లోగా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేసి దాన్ని రిలీజ్ కూడా చేయాలని మహేష్ ఫిక్స్ అయ్యాడట. అందుకే ఇలా షార్ట్ టైంలో మహేష్ తన సినిమాను పూర్తి చేయాల్సిందిగా టైమ్ పెట్టినట్లు తెలుస్తోంది.