వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. తగ్గేదేలే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలతో పాటు.. మరోవైపు తమ ఫేవరేట్ దర్శకులతో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్,రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్లు నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే 100 స్పీడ్ తో దూసుకుపోతున్నారు అని చెప్పాలి.. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న పాన్ ఇండియాను వాడేసుకుని కలెక్షన్స్ లో రఫ్ఫాడించాలని స్టార్ హీరోలందరూ ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో స్పీడ్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బుచ్చిబాబు తో ఓ సినిమాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాదండోయ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి పేరు కూడా ఎన్టీఆర్ తో కాంబినేషన్ అంటూ వినిపిస్తోంది. ఏదేమైనా తారక్ స్ఫీడ్ మాత్రం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్.. త్వరలో త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ చేయబోతున్నాడట. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుంది అన్నది తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో కూడా ఇన్ డైరెక్టుగా క్లూ ఇచ్చారు. ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక తర్వాత తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. రీ ఎంట్రీ తర్వాత కాస్త స్లో అవుతాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు షూటింగ్ కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.

అక్కినేని హీరో నాగచైతన్య కూడా సినిమాలే కాదు వెబ్ సిరీస్ ల తో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం బంగార్రాజు అనే సినిమాలో తండ్రితో కలిసి నటించిన నాగ చైతన్య.. లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో అమీర్ ఖాన్తో కలిసి నటిస్తున్నాడు. నాగచైతన్య ప్రధాన పాత్రల్లో థాంక్యూ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదండోయ్ నెట్ఫ్లిక్స్ వేదికగా హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక ఇవన్నీ పూర్తయ్యాక విజయ్ కనకమేడల, నందినిరెడ్డి లాంటి దర్శకులు కూడా చైతూ కోసం కథలు పట్టుకునీ లైన్ లో ఉన్నారట.

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాగశౌర్య 2022 సంవత్సరంలో కూడా వరుసగా సినిమాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి, పోలీసువారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగశౌర్య.

2022 లో అలరించి బోయే సినిమాల్లో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ సినిమా కూడా ఉండడం గమనార్హం. ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాబోతుంది. ఇక తర్వాత నాని కొత్త సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.